తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'బంగారు తెలంగాణ' - నిర్మాత డా. లయన్ ఎ.వి.స్వామి

  • IndiaGlitz, [Friday,January 06 2017]

బిపిన్‌, రమ్య జంటగా షిరిడిసాయి క్రియేషన్స్‌ పతాకం పై శ్రీమతి రమ్య సమర్పణలో బిపిన్‌ దర్శకత్వంలో డా . లయన్‌ ఎ.వి. స్వామి నిర్మిస్తున్న చిత్రం 'బంగారు తెలంగాణ'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం డిటిఎస్‌ ఫైనల్‌ మిక్సింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. లయన్‌ ఎ.వి. స్వామి చిత్ర విశేషాలను తెలియచేశారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత డా. లయన్‌ ఎ.వి. స్వామి మాట్లాడుతూ... ''బేసిక్‌గా నేను హైకోర్ట్‌ అడ్వకేట్‌ని. ఈ చిత్రంలో కూడా లాయర్‌ పాత్రలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ చేశాను. ఈ చిత్ర కథ విషయానికొస్తే... 1969లో వివేకవర్ధిని కళాశాలలో తొలి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆనాటి నుండి నేటి శ్రీకాంతాచారి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. అలాగే అనేకమంది ఎన్నో ఉద్యమాలు చేశారు. అందరి సమిష్టి కృషి ఫలితంగా బంగారు తెలంగాణ సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలందరికీ మేలు కలిగేలా తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారు. చండీయాగం తలపెట్టి రాష్ట్ర బాగుకోసం అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలోనే మా చిత్రం ఉంటుంది.
బిపిన్‌, రమ్య ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు బిపిన్‌ ఎంతో అద్భుతంగా మా చిత్రాన్ని రూపొందించారు. హైదరాబాద్‌, రాచకొండ, నారాయణపూర్‌, భువనగిరి, నల్గొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాం. రఘునాధరెడ్డి, బాబుమోహన్‌, గౌతంరాజు, జాకీ, మాస్టర్‌ సాయి త్రిశాంక్‌, రజిత, ప్రీతినిగమ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆణిముత్యాల్లాంటి ఐదు పాటలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న 'బంగారు తెలంగాణ' ఆడియోని గ్రాండ్‌గా జరపనున్నాం. రీ రికార్డింగ్‌, ఫైనల్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని మార్చి రెండో వారంలో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.
రఘునాధరెడ్డి, బాబుమోహన్‌, గౌతంరాజు, జాకీ, ప్రసన్నకుమార్‌, ఎ.వి. స్వామి, గుండు హనుమంతరావు, రజిత, ప్రీతినిగమ్‌, రాగిణి, దివ్య, రమ్య, కృష్ణవేణి, కల్పన, క్రాంతి, రోజా, ప్రతిభశ్రీ, సౌజన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, కో ప్రొడ్యూసర్‌: కిష్టంపల్లి సురేందర్‌రెడ్డి, సమర్పణ: శ్రీమతి రమ్య, నిర్మాత: డా|| లయన్‌ ఎ.వి. స్వామి, కథ- మాటలు - పాటలు - సంగీతం - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: బిపిన్‌.