దళితులపై మరోసారి వివక్ష.. అంబేద్కర్‌పై విషం వెళ్లగక్కిన పెత్తందార్లు..

  • IndiaGlitz, [Saturday,January 20 2024]

దళితులు అంటే పెత్తందారులకు ఎంత చులకనో మరోసారి బహిర్గతమైంది. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఆవిష్కరించారు. విగ్రహం ఆవిష్కరించి 24 గంటలు ముగిసినా ఇంతవరకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒక్కరంటే ఒక్క నేత కూడా విగ్రహాన్ని సందర్శించలేదు. ఆ పార్టీలకు అంబేద్కర్ అంటే ఎంత గౌరవమో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. తొలి నుంచి పెత్తందారి పార్టీలకు దళితులు అంటే చిన్నచూపే. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ఏకంగా చంద్రబాబు అన్న మాటలు అంత త్వరగా ఎవరైనా మర్చిపోగలరు.

హర్షధ్వనుల మధ్య విగ్రహావిష్కరణ..

అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిగా తీసుకుని పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్.. ఆయనకు ఎనలేని గౌరవం ఇచ్చేలా కృషి చేశారు. అందుకే దళితులు తమ ఆత్మగౌరవ ప్రతీకగా భావించే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించారు. ఇందుకోసం ఏకంగా రూ.400కోట్లు ఖర్చు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సోదరీసోదరమణులు, ప్రజా ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. వారి హర్షధ్వనుల మధ్య సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంబేద్కర్‌పై ద్వేషం వెళ్లగక్కుతున్నట్లే కదా..?

ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందించినా సరే వారు హాజరుకాలేదు. అంటే వారికి అంబేద్కర్‌పై ఎంత ద్వేషం ఉందో తెలియజేసినట్లైంది. టీడీపీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, తదితర నేతలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు పంపారు. అయినా వారు ఎందుకు హాజరుకాలేదనే ప్రశ్నలు దళిత వర్గాల తలెత్తుతున్నాయి. వారి నాయకుడికి అంబేద్కర్ మీద ప్రేమ, గౌరవం ఉంటే ఈ కార్యక్రమానికి తన పార్టీ నేతలను పంపించేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు.

తీవ్రంగా అవమానించిన పచ్చ మీడియా..

ఇదిలా ఉంటే దేశం మొత్తం గర్వించదగ్గ మహానీయుడి విగ్రహం ఆవిష్కరణ ఓ పండుగలా జరుగుతుంటే పచ్చ మీడియా మాత్రం ఈ వేడుకను తమ ఛానళ్లలో ప్రసారం చేయలేదు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదంటే అంబేద్కర్‌ను, తమ దళిత జాతిని అవమానపరిచినట్టే కదా అని నిలదీస్తున్నారు. పెత్తందారులకు, అగ్రకులాలకు కొమ్ముకొసే యెల్లో మీడియా.. బడుగు, బలహీనవర్గాలకు ఎందుకు అండగా నిలబడటం లేదని మండిపడుతున్నారు.

పెత్తందార్లుకు బుద్ది చెబుతామని వార్నింగ్..

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరూ కూడా ఈ కార్యక్రమంపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణను స్వాగతించలేదు. అంటే వీరంతా అంబేద్కర్‌ ఆశయాలను వ్యతిరేకిస్తున్నట్లే కదా అని అభిప్రాయపడుతున్నారు. ఇంకెన్నాళ్లూ తమ దళిత జాతిని అవమానపరుస్తారని మండిపడుతున్నారు. తమతో పాటు తమ ఆరాధ్య దైవం అంబేద్కర్‌ను చులకనగా చూస్తున్న ఇలాంటి పెత్తందారులకు వచ్చే ఎన్నికల్లో తమ ఓటుతో బుధ్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు.