BRS Party: పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు తగ్గిందా.. పెరిగిందా..? తేడా వస్తే మాత్రం..?

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అయితే తమకే ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్,బీజేపీ,బీఆర్ఎస్ అంచనాలు వేసుకుంటున్నాయి. 13 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుంటే.. 12 స్థానాల్లో జెండా పాతేస్తామని బీజేపీ చెబుతోంది. అలాగే గులాబీ పార్టీ కూడా 10కి పైగా స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎంఐఎంకు ఒక సీటు వేసినా.. మిగిలిన 16 స్థానాల్లో ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అయితే కాంగ్రెస్, బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం బీఆర్ఎస్ పార్టీకే అవసరమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే ఓవైపు రాష్ట్రంలో అధికారంలో కోల్పోవడంతో చాలా మంది సీనియర్ నేతలు పార్టీ వీడి వెళ్లిపోయారు. మిగిలిన అరకొర నేతలు కూడా బైబై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కాస్త బ్రేక్ వేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 5 కంటే ఎక్కువ స్థానాలు గెలవకపోతే పార్టీ నుంచి వలసలు ఆపడం కష్టతరం కానుంది. మరోవైపు గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా రాష్ట్రంలో బలంగా పుంజుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. బీజేపీ కూడా అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకుంది. దీంతో కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరు అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి తయారైంది.

అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్.. ఇప్పుడు అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం చుట్టుముడుతోంది. ఇక నమ్మకస్తులైనా కీలక నేతలంతా కష్టసమయంలో పార్టీని వీడిపోయారు. ఇదిలాఉంటే ఫాంహౌస్‌లో జారిపడి తుంటి ఎముక ఆపరేషన్ జరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు. అయినా పార్టీ ఉనికి కోసం బస్సు యాత్ర చేశారు. బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చిందని.. అంతేకాకుండా కాంగ్రెస్ అలివికాని హామీలు ఇచ్చిందని.. అవి అమలు చేయకపోవడంతో ప్రజలు గుర్రుగా ఉన్నారని కేసీఆర్ చెబుతున్నారు.

అందుకే కనీసం 10కి పైగా సీట్లు గెలుస్తామని జోస్యం చెబుతున్నారు. అయితే కేసీఆర్ చెప్పినట్లుగా కాకపోయినా కనీసం 5 ఎంపీ సీట్లు గెలిస్తేనే పార్టీ క్యాడర్‌లో తిరిగి జోష్ వస్తుంది. అలా కాకుండా కేవలం ఒకటో రెండో సీట్లకు పరిమితమైతే మాత్రం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. దీంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడనుంది. గులాబీ బాస్ అంచనా వేస్తున్నట్లు సీట్లు వస్తే పర్వాలేదు.. కానీ ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించిన ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో బాసటగా నిలిచారో.. లేదో.. లేక పూర్తిగా పక్కన పెట్టారో తెలియాలంటే జూన్ 4వ తేది వరకు ఆగాల్సిందే.