Bhatti, Ponguleti:తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటి

  • IndiaGlitz, [Thursday,January 18 2024]

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. గుండెపోటు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయననను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తమ్మినేని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

అంతకుముందు మాజీ మంత్రి హరీష్‌రావు, సీపీఎం నేత బీవీ రాఘువులు తమ్మినేని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. లంగ్స్‌లో నీరు తొలగించామని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వచ్చే రెండు రోజులు కీలకమని తెలిపారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దని.. దయచేసి ఆస్పత్రికి ఎవరూ రావద్దని సీపీఎం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా రెండు రోజుల క్రితం జనవరి 16న ఖమ్మం జిల్లాలోని తన స్వస్థలం తెల్దారుపల్లిలోని ఆయన నివాసంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు వెంటిలేటర్ సాయంతో మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఓసారి తమ్మినేని గుండెపోటుకు రావడంతో స్టంట్స్ వేశారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు .

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసిన విషయం విధితమే. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయంలో చివరి నిమిషం దాకా ఎదురుచూసిన ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలో సింగిల్‌గానే పోటీకి దిగింది. అయితే తమ్మినేని వీరభద్రంతో పాటు ఆ పార్టీ నుంచి పోటీ చేసి అందరూ అభ్యర్థులు ఓడిపోయారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మాత్రం గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.