ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుమార్తెను మోసగించిన సైబర్ నేరగాడు..

సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కుమార్తెకే ఓ సైబర్ నేరస్థుడు టోకరా వేశారు. సీఎం కుమార్తె అయిన హర్షిత తన పాత సోఫాను విక్రయించేందుకు ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ క్రమంలోనే ఓ సైబర్ నేరగాడు ఆన్‌లైన్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.34 వేలను మోసం చేసి తన ఖాతాలోకి వేసుకున్నాడు. సీఎం కుమార్తె విక్రయానికి పెట్టిన సోఫాను కొంటానని తాను కస్టమర్‌నంటూ ఓ సైబర్ నేరగాడు ముందుగా ఆమె ఖాతాలోకి కొంత డబ్బు పంపించాడు.

మొదట హర్షితకు సైబర్ నేరగాడు క్యూఆర్ కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంటు ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్మించాడు. అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అప్పటికి కూడా ఆమె తెలుసుకోలేకపోయింది. వెంటనే అది తప్పు కోడ్ అని, సరైన కోడ్ పంపుతానని సైబర్ నేరగాడు హర్షితను నమ్మించాడు. అలా మరో రూ.14వేలు ఖాళీ అయ్యాయి. ఈ మోసంపై సీఎం కుమార్తె హర్షిత ఢిల్లీలోని సివిల్ లైన్సు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు సైబర్ మోసం చేసి, సీఎం కుమార్తె బ్యాంకు ఖాతాలోనుంచి డబ్బును తీసుకున్న ఆగంతకుడి ఆరా కోసం అన్వేషిస్తున్నారు.