Rahul Gandhi: గెలుపు కోసం కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. ఆరు రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రచారం

  • IndiaGlitz, [Monday,November 13 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎన్నికల బరిలో దిగి క్యాంపెయిన్ హోరెత్తిస్తు్న్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్న హస్తం పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా ఆరు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈనెల 17న రాష్ట్రానికి రానున్న రాహుల్.. 23వ తేదీ వరకూ ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో ప్రచారం నిర్వహిస్తారని.. అనంతరం వరుసగా ఆరు రోజుల పాటు ఇతర నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలల్లో ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సమావేశాలు ఉండనున్నాయని వెల్లడించాయి. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో జోష్ నింపనున్నారు.

కాగా ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు సార్లు పర్యటించిన సంగతి తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను ఎలా అమలుచేస్తామో కూడా వివరించారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర చర్చనీయాంశమైన మేడిగడ్డ బ్యారేజీని కూడా రాహుల్ సందర్శించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎం లాగా మార్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.