Congress and CPI:కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు.. ఒక సీటు, రెండు ఎమ్మెల్సీలకు అంగీకారం..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటుంది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధమైంది. అయితే సీపీఐ, సీపీఎం తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. సీపీఐతో మరోసారి చర్చలు జరిపింది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకటరెడ్డిలతో చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని రేవంత్ హామీ ఇవ్వగా.. ఇందుకు సీపీఐ అంగీకారం తెలిపింది.

సుదీర్ఘ చర్చల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీపీఐతో కాంగ్రెస్ పార్టీ చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు. సీపీఐకి కొత్తగూడెంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీచేస్తుందని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చేతిలో నుంచి తెలంగాణని విముక్తి చేయడం తమ లక్ష్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే లిక్కర్ స్కాంలో కవితని అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఫామ్‌హౌస్ పాలనకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని నారాయణ వ్యాఖ్యానించారు. మొత్తానికి కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు సీపీఎం నేతలతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు.