CM Revanth Reddy: కాళేశ్వర్‌రావు కోసం హెలికాఫ్టర్‌ సిద్ధం.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు..

  • IndiaGlitz, [Tuesday,February 13 2024]

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. ఎంఐఎం సభ్యులు కూడా వీరితో పాటు వెళ్లారు. అయితే ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. దీంతో శాసనసభ్యుల పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసలు భారీ భద్రత ఏర్పాటుచేశారు. సాయంత్రం 5-6 గంటల మధ్య ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు

అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్ది కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి అంచనాలు పెంచారని మండిపడ్డారు. సుమారు రూ. 38,500 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అంచనా ఇప్పటికి లక్షా 47వేల కోట్లకు చేరిందన్నారు. భవిష్యత్తులో దీనిని పూర్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.

ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని.. ఇసుకలో పేక మేడలు కట్టారా? అని నిలదీశారు. ప్రాజెక్టును ఎవరూ సందర్శించకుండా ఇండియా - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పహారా ఏర్పాటుచేశారని విమర్శించారు. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉందన్నారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాలని.. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. 'మీరు, మీ శాసనసభ్యులు మేడిగడ్డకు రండి. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి. మీ అనుభవాలను.. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అక్కడ అందరికీ వివరించి చెప్పండి. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?. తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు..?శిక్ష ఏమిటి..?. కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు. కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే.. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది. రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాళేశ్వరం కథేంటో సభలో తేలుద్దాం' అని వెల్లడించారు.