KCR: సీఎం కేసీఆర్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు: కేటీఆర్

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనారోగ్యంపై ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల ఆయన కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఓ ఇంగ్లీష్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. సచివాలయంలో కూడా ఎక్కడా కనిపించలేదు.

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు..

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26న సీఎం కేసీఆర్ వారం రోజులుగా దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారని.. ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెసిందే. ఇప్పుడు వైరల్ ఫీవర్‌తో పాటు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని కేటీఆర్ తెలపడంతో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో త్వరగా అనారోగ్యాన్ని జయించి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నారు.

మంత్రి కేటీఆర్‌పై మాకు అనుమానం ఉంది..

ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కేసీఆర్ అనారోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ కనపడటం లేదని.. మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కేటీఆర్‌పై తమకు అనుమానంగా ఉందని.. తక్షణమే కేసీఆర్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి.