Kishan Reddy:కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి: కిషన్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అందకారంలో పడిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కుంగిన మేడిగడ్డ డ్యామ్‌ను ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్‌కు సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

మేడిగడ్డ పిల్లర్లకు పగళ్లు వచ్చిన వార్త తెలియగానే కేంద్ర జలశక్తి నిపుణులకు లేఖ రాయడం జరిగిందని.. దానిపై స్పందించిన జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి బ్యారేజీని పరిశీలించారన్నారు. అనంతరం చాలా తీవ్రమైన అంశాలు నివేదికలో పొందుపరిచారని తెలిపారు. అన్నారం బ్యారేజీలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని.. నాణ్యత లోపం వల్లే వృథాగాపోతోందన్నారు. ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వలేదన్నారు. వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని ఆయన మండిపడ్డారు.

నిపుణులైన ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం గోదారిలో పోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించడంతో ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఈ ప్రాజెక్టు గుదిబండగా మారిందన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు 20 అంశాలపైన డాటా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలపైనే నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.