close
Choose your channels

CM KCR:నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు సీఎం కేసీఆర్ నామినేషన్లు

Monday, October 9, 2023 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నవంబర్ 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి గజ్వేల్‌లో మొదటి నామినేషన్ వేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేస్తారు. తదుపరి 3 గంటల‌కు కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

అక్టోబర్ 15న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం..

ఇక అక్టోబర్ 15న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమవుతారు. అదే రోజు అభ్యర్థులకు బీఫారం అందజేయడంతో పాటు పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. నవంబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో.. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరం సభలకు హాజరుకానున్నారు. 18న జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే పార్టీ సమావేశంతో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. మరోవైపు ఇతర నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్..

ఇక తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15 వరకు నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా 20,892 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సగటున ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పింది. అలాగే 27,798 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.