పేద పిల్లలకు పెద్ద చదువులు చెప్పించేలా సీఎం జగన్ కార్యాచరణ

  • IndiaGlitz, [Thursday,February 01 2024]

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే విద్యారంగంలో సంస్కరణలకు తెరలేపారు. ఇందులో భాగంగా నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చారు. అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లల స్కిల్స్‌ పెంపొందిస్తున్నారు. ఇదే కాకుండా ప్రీ లోడెడ్ బైజూన్ కంటెంట్‌తో కూడిన టాబ్‌లు పంపిణీ, ఐఎఫ్‌పీలతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఆధునిక మౌలిక సౌకర్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచే టోఫెల్ వంటి పరీక్షలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’(ఐబీ) సిలబస్‌..

మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌‌ను దశల వారీగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఐబి సిలబస్‌ను అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. పేదల బాగు కోసం ప్రతి క్షణం ఆలోచించే ముఖ్యమంత్రి.. పిల్లలకు చదువే ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అందుకే వారిని ఉన్నత చదువులు చదివే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ధనికుల పిలల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన విద్య ఇప్పుడు పేదలకూ అందించేందుకు సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’(ఐబీ) సిలబస్‌ను అమలు చేయనున్నారు.

2025 జూన్ నుంచి అందుబాటులోకి..

ఈ మేరకు ఐటీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడి తమ మేథా పటిమను నిరూపించుకోనున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా ట్రైనింగ్ ఇస్తారు. 2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు.

సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు..

పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను అందజేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది. ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన చేయడమే దీని ప్రత్యేకత. అలాగే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. దీంతో పేద పిల్లల భవిష్యత్‌ ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతో సొంత మావయ్యలా జగన్.. అండగా ఉంటున్నారు.