Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ అధికారులు

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ అధికారులు సవాల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ(మంగళవారం) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా చంద్రబాబు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిన విషయం విధితమే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. దీంతో ఈ నెల 28న రాజమండ్రి జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 17న వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది. మరో రెండు రోజుల్లో తీర్పు రానుంది. దీంతో ఈ తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కేసులో అవినీతి చేశారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెల 31న హైకోర్టు ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.