జూన్-1న సీఎం జగన్‌ను చిరు కలవబోతున్నారా!?

జూన్-01న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్, టాలీవుడ్ పెద్దన్న చిరంజీవి కలవబోతున్నారా..? ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి చిరుకు ఈ కబురు అందిందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు ఈ భేటీ వెనుక ఆంతర్యమేంటి..? చిరుతో పాటు ఎవరెవరు జగన్‌ను కలవబోతున్నారు..? ఏమేం చర్చించనున్నారనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్‌ సర్వం బంద్ అయిన విషయం తెలిసిందే. అన్ని ఇండస్ట్రీల కంటే ముందుగానే టాలీవుడ్ బంద్ చేసింది. అయితే ఇప్పటికే రెండు నెలలకు పైగా గడిచిపోవడంతో.. ఈ సినిమాపైనే ఆధారపడిన లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో కొన్ని నిబంధనలను పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవచ్చని.. అదే విధంగా డిపాజిట్స్ చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నుంచి ముందుగా ఉత్తర్వులు వచ్చాయి. ఇక తెలంగాణ నుంచి కూడా అనుమతులు తీసుకోవాలని భావించి చిరు ఇంట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో కీలక భేటీ జరిగింది. ఆ తర్వాత నేరుగా సీఎం కేసీఆర్‌ను కలవడం.. పోస్ట్ ప్రొడక్షన్స్‌కు వెంటనే అనుమతివ్వడం.. షూటింగ్స్‌కు మాత్రం జూన్-01 నుంచి షురూ చేసుకోవచ్చని అయితే థియేటర్ల ఓపెనింగ్స్‌కు మాత్రం కొంచెం ఆలస్యమవచ్చని సీఎం స్పష్టంగా వివరించారు.

చిరు ట్వీట్..
ఈ మేరకు ముందుగా అనుమతులిచ్చిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారు సినీ పరిశ్రమకి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియచేశాను. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు. అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను పలువురు సినీ ప్రముఖులు రీ ట్వీట్ కూడా చేశారు. కొందరు నెటిజన్లు అయితే అనుమతిలిచ్చిన ఇన్ని రోజులకా స్పందించేది అంటూ విమర్శలూ గుప్పించారు.

భేటీ ఫిక్స్ అయ్యిందా..!?
కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూన్-01న చిరుతో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు.. జగన్‌ను కలవబోతున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి చిరుకు కబురు అందిందిందని సమాచారం. ఈ క్రమంలో భేటీలో భాగంగా ఇంకేమేం చర్చించాలి..? సీఎంకు ఏమేం విజ్ఞప్తులు ఇవ్వాలి..? అనేదానిపై ఓ నివేదికను తయారు చేసే పనిలో చిరు అండ్ పెద్దలు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, తరలింపుపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని తరలింపులు చేసేయాలని జగన్ కూడా హామీ ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. భేటీ అనంతరం చిరు అమరావతిలోనే మీడియా మీట్ నిర్వహించబోతున్నారని తెలిసింది. కాగా.. వైఎస్ కుటుంబంతో మెగాస్టార్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక ‘సైరా’ సినిమా టైమ్‌లో అమరావతిలో జగన్‌ను చిరు కలిసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి త్వరలో జరగనున్న భేటీలో ఏమేం చర్చించనున్నారు..? ఇండస్ట్రీ నుంచి ఏమేం విజ్ఙప్తులు వెళ్లనున్నాయ్..? ప్రభుత్వం నుంచి ఏమేం ప్రకటనలు వస్తాయ్..? అనేదానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.