చైనాలో ఘోర విమాన ప్రమాదం... అందులో 132 మంది ప్రయాణీకులు, కొండపై భారీగా మంటలు

  • IndiaGlitz, [Tuesday,March 22 2022]

చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 132 మందితో వెళ్తోన్న బోయింగ్‌ 737 విమానం చైనాలో గుయాంగ్జి ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో  కున్మింగ్‌ నగరం నుంచి గుయాంగ్‌ఝౌ నగరానికి బయల్దేరిన చైనా ఈస్ట్రన్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానానికి మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయింది.

ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం . ఆ వెంటనే గుయాంగ్జి ప్రాంతంలోని వుజౌ నగర సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి విమానం కూలినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విమానం 3.05 గంటలకు ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. మరికొన్ని నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనగా విమానం కుప్పకూలింది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి చెందిన బంధువులు, ఆప్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో 2010లో చైనాలోని యిచున్‌ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 42 మంది చనిపోయారు. హెనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యిచున్ విమానాశ్రయానికి చేరుకుంటుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది.