Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలోని తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఆగే సమయంలో ఒక్కసారిగా కుదుపుకు గురై ఫ్లాట్‌ఫాం సైడ్ గోడలను ఢీకొట్టింది. ఆ సమయంలో రైలు ఆగుతుంది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు. కొంతమంది ప్రయాణికులు స్వల్పగాయాలయ్యాయి. హఠాత్‌పరిణామంతో మరికొంతమంది ప్రయాణికులకు గుండెపోటు వచ్చింది. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన ఇవాళ ఉదయం 9.15 గంటల సమయంలో చోటుచేసుకుంది. డెడ్ ఎండ్ గోడను రైలు ఢీకొట్టడంతో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ రైలు నుంచి దిగే ప్రయ్నతం చేశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని కానీ కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పింది. దీనిపై మరింత దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించింది.

మరోవైపు నాంపల్లిలో జరిగిన ఈ రైలు ప్రమాదం ఘటనపై హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంఛార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాలని సూచించారు.