Telangana Cabinet:తెలంగాణ తల్లి విగ్రహం, TS పేరులో మార్పులు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

  • IndiaGlitz, [Monday,February 05 2024]

తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఆమోదం తెలిపింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రకటన అసెంబ్లీ సమావేశాల్లో చేయనుంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర అధికార చిహ్నంలో కూడా మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై ప్రస్తుతం ఉన్న TS పేరును TGగా మారుస్తూ తీర్మానం చేసింది. దీంతో ఇక నుంచి అన్ని విషయాల్లో రాష్ట్రం పేరును TGగానే పరిగణించనున్నారు.

ఇక రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ'కు మంత్రిమండలి ఆమోదించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలేలా ఉండేలా TS పేరు మండిపడింది. కులగణన చేపట్టడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండగా.. 9వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ.. 10వ తేదీ ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఇక రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో హైకోర్టుకు వందెకరాలను కేటాయిస్తూ ఆమోదముద్ర వేసింది. ఖైదీలకు క్షమాభిక్ష కోసం అవసరమైన ప్రక్రియను చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు మొగ్గుచూపిన కేబినెట్.. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. గ్రూప్-1లో 160 పోస్టులు కలిపి రీనోటిఫికేషన్‌కు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే గ్రూప్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

మంత్రివర్గం సమావేశానికి ముందు కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్లకు అమ్ముడుపోయారంటూ ఆరోపణలు చేశారు. కేసీఆర్ హయాంలోనే ఏపీలో కొత్త ప్రాజెక్టులు వచ్చాయన్నారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి కడుతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మరోవైపు కృష్ణా ప్రాజెక్టుల వివాదం, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ కీలక సమావేశం జరిగింది. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.