close
Choose your channels

Chandramohan:హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్.. తొలి సినిమాతోనే నంది అవార్డ్..

Saturday, November 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూయడంపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ మేడూరు, బాపట్లలో విద్యాభ్యాసం చేశారు. కళాతపస్వి కె. విశ్వనాథ్, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ప్రముఖ నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ చంద్రమోహన్ బంధువులు కావడం విశేషం. 1966లో దివంగత దర్శకుడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన 'రంగులరాట్నం' సినిమాతో చంద్రమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ అందుకున్నారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించిన 'సుఖ దుఃఖాలు'సినిమాతో ఆయన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 55 ఏళ్ల తన సినీ కెరీర్‌లో మొత్తం 932 సినిమాలు చేసిన చంద్రమోహన్.. అందులో హీరోగా 175 సినిమాలు చేశారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించడంతో పాటు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించారు.

'పదహారేళ్ళ వయసు', 'సిరిసిరిమువ్వ', 'సీతామహాలక్ష్మి', 'జీవన తరంగాలు', 'మీనా', 'ఓ సీత కథ', 'సెక్రటరీ', 'రెండు రెళ్లు ఆరు', 'రాబర్ట్ రామ్ రహీమ్', 'శంకరాభరణం' తదితర చిత్రాల్లో చంద్రమోహన్ నటించారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని.. డబ్బులు దాచుకున్నవారికే విలువ ఉంటుందని చంద్రమోహన్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచించారు. 'సిరిసిరిమువ్వ', 'శుభోదయం', 'సీతామహాలక్ష్మి', 'పదహారేళ్ల వయసు' చిత్రాల్లో నటించడం మర్చిపోలేనని తెలిపేవారు. ఆయన తల్లి చనిపోయే సమయంలో మనసంతా నువ్వే సినిమాలో నటిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ పేరు గడించారు. తమ కెరీర్‌ బిగినింగ్‌లో శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి నటులు చంద్రమోహన్‌తో నటించి విజయవంతం అయ్యారు. దీంతో ఆయనకు లక్కీ హీరోగా ముద్రపడింది. ఇక భార్యాభర్తలుగా చంద్రమోహన్‌, సుధ కాంబినేషన్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఉత్తమ హాస్యనటుడిగా 'చందమామ రావే' సినిమాకు గాను 1987లో చంద్రమోహన్ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2005లో 'అతనొక్కడే' సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో నంది సొంతం చేసుకున్నారు. మొత్తం మీద చంద్రమోహన్ 6 నంది పురస్కారాలను అందుకున్నారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. చివరిగా గోపిచంద్ హీరోగా నటించిన 'ఆక్సిజన్' చిత్రంలో ఆయన నటించారు. అలనాటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో పాటు తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోలతో కూడా చంద్రమోహన్ నటించారు. ఇక ఈతరం హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్, విష్ణు మంచు, రామ్, రవితేజ, గోపీచంద్, ఉదయ్ కిరణ్, మనోజ్ సినిమాల్లో కూడా నటించారు. ఇలా మూడు తరం హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment