Chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లు మంగళవారానికి వాయిదా

  • IndiaGlitz, [Friday,October 13 2023]

సుప్రీంకోర్టులో టీడీపీ ఛీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఇవాళ న్యాయస్థానంలో ముందుగా క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగగా.. ఇవాళ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా అని రోహత్గి వాదించారు. చట్ట సవరణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు పాతదే అంటారు.. అంతేనా? అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని తన వాదన అని రోహత్గి చెప్పుకొచ్చారు. 2018 జులైలో చట్టసవరణ జరిగిందని.. 2014, 2015 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేం అన్నారు. నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయానికి తనకు సంభందం లేదన్న చంద్రబాబు 17ఏ వర్తింపజేయాలని కోరడం పరస్పర విరుద్ధమని ముకుల్ పేర్కొన్నారు.

కేసులు మీద కేసులు పెట్టి సర్కస్ ఆడిస్తున్నారు..

అంతకుముందు చంద్రబాబు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌నెట్‌ కేసుతో సంబంధం ఉందని.. ఈ కేసులో చంద్రబాబును 16న కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్‌ తీసుకున్నారని వాదించారు. కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్‌ ఆడిస్తున్నారన్నారు. ఇక్కడ కూడా 17-ఏను ఛాలెంజ్‌ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు. 17ఏ నిబంధన ఉన్నప్పుడు కేసుపెట్టే అధికారమే పోలీసులకు లేనప్పుడు కేసు ఎలా ఫైల్ చేస్తారని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. అనంతరం మంగళవారానికి విచారణను వాయిదా వేశారు.

సోమవారం అరెస్ట్ ఉండదని సీఐడీ తరపున హామీ..

అనంతరం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ జరిగింది. కాగా, ఈ కేసులోనూ 17ఏ పరిగణలోకి తీసుకోలేదని చంద్రబాబు లాయర్ లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగులర్ బెయిల్ వచ్చినప్పుడు తన క్లయింట్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో సోమవారం హాజరుపరచాల్సి ఉందని.. ఆరోజు హాజరుపరిస్తే చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సోమవారం అరెస్ట్ ఉండదని లేదంటే ట్రయల్ కోర్టులో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరతామని రోహత్గీ తెలిపారు. దీంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.