Chandrababu Naidu:చంద్రబాబుకు రిమాండ్ , పెత్తందార్లపై పేదల విజయం.. కోర్ట్ ముందు తలవంచిన మోసగాళ్లు

  • IndiaGlitz, [Monday,September 11 2023]

నూరు గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనను ఎవరూ టచ్ చేయలేరని విర్రవీగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చెంపపెట్టు లాంటి పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. స్టేలు తెచ్చుకుంటూ గడిపిస్తున్న చంద్రబాబు ఫస్ట్ టైం ఊచలు లెక్కబెడుతున్నారు. విద్యార్ధుల డబ్బును పందికొక్కుల్లా మెక్కిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. తనకు ఏం కాదని.. ఇందులోనూ బయటకు వచ్చేస్తానని భావించిన చంద్రబాబుకు ఈ తీర్పు ఏమాత్రం మింగుడు పడలేదు. తీర్పు చెబుతున్నప్పుడే ఆయన ముఖంలో రక్తపు చుక్క లేదు. అయితే రిమాండ్‌ను హౌస్ అరెస్ట్‌గా మార్చాలని చివరి నిమిషం వరకు చంద్రబాబు లాయర్లు ప్రయత్నించారు. కానీ కోర్ట్ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో రాజకీయ జీవితంలో తొలిసారిగా చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు తెలుగునాట అవినీతి ఆరోపణల్లో తొలిసారి జైలుకెళ్లిన మాజీ సీఎంగా చంద్రబాబు నాయుడు అప్రతిష్ట మూటకట్టుకున్నారు.

అసలేంటీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం:

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్కాంకు కేవలం 2 నెలల్లోనే రూపకల్పన చేశారు. సీమెన్స్ అనే కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టి.. యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఊదరగొట్టారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, మిగతా 90 శాతం ఖర్చును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద సీమెన్స్‌ భరిస్తుందని చెప్పారు. స్కిల్‌డెవల్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి నోట్‌ పెట్టించారు. ఈ క్రమంలో సెక్రటరీ , ఆ పై స్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్‌ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. మంత్రి మండలి సమావేశాల్లో దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. నిజానికి ఇలా కేబినెట్‌కు నోట్‌ పెట్టడం నియమాలకు, నిబంధలనకు పూర్తిగా విరుద్ధం.

ఆర్ధిక శాఖ వద్దన్నా చంద్రబాబు జోక్యం :

అంతేకాదు.. ఒప్పందానికి, ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు ఎలాంటి పొంతన లేదు. సీమెన్స్ నుంచి ఎలాంటి మొత్తం విడుదల కాకముందే ఏపీ ప్రభుత్వం ఐదు విడతల్లో డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల విడుదలకు ఆర్ధిక శాఖ అధికారులు కొర్రీలు పెట్టగా.. స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశారు. ఇలా విడుదల సొమ్ము 70కి పైగా షెల్ కంపెనీల చేతులు మారి తిరిగి చంద్రబాబు వద్దకే వచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వెలుగుచూసిన తక్షణం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైల్స్ మాయమయ్యాయి.

జీఎస్టీ అధికారులకు అనుమానం .. వెలుగులోకి స్కాం:

స్కిల్‌ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్‌పీ/స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ కంపెనీలు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా సెన్‌వాట్‌ కోసం క్లెయిమ్‌ చేశాయి. అయితే ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు ఎక్కడో తేడా కొట్టింది. వెంటనే ఆ కంపెనీల లావాదేవీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు తేలింది. 2017లోనే మొత్తం వ్యవహారం బయటపడింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో వుండటంతో కుంభకోణంపై ఎలాంటి స్పందన లేదు.

టీడీపీ అక్రమాలపై ఫోకస్ పెట్టిన జగన్ :

2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు విప్పే పని చేపట్టారు. అమరావతి భూ కుంభకోణం, అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై జగన్ సీరియస్‌గా దృష్టి సారించారు. సుదీర్ఘ విచారణ జరిపి, పక్కా ఆధారాలు సేకరించిన ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసులను సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు చంద్రబాబుకు అందజేశారు. ఆయనపై 120(బి),166,167, 418, 420, 465, 468, 201,109, రెడ్ విత్ 34 , ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ విచారణ జరిపి ఎనిమిది మందిని అరెస్ట్ చేసారు. దీంతోబాటు డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎటాచ్ చేసింది.

చంద్రబాబును దోషిగా నిలబెట్టిన తిరుగులేని ఆధారాలు :

నేరం చేసింది ఎంతటి వారైనా , ఏ స్థాయిలో వున్నవారైనా శిక్ష పడాలన్నది జగన్ తత్త్వం. అందుకే చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెట్టడానికి కావాల్సిన ఆధారాలను సంపాదించేందుకు అధికారులకు స్వేచ్చనిచ్చారు. సీఐడీ అధికారులు కూడా సైలెంట్‌గా తమ పనికానిచ్చారు. పూర్తి ఆధారాలను న్యాయస్థానం ముందు పెట్టి ధర్మాధర్మాలను మీరే నిర్ణయించండి అని ప్రభుత్వం తరఫున న్యాయాన్ని అర్థించారు జగన్. కోర్టుకు సమర్పించిన ప్రతిపేజీలోనూ చంద్రబాబు అవినీతి కొట్టొచ్చినట్లు స్పష్టమైంది. ఎక్కడా తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏం వాదించాలో తెలియక సాంకేతిక అంశాలను తెరమీదకు తెచ్చారు. చివరికి ప్రభుత్వం పక్షాన న్యాయం నిలిచి.. ధర్మం గెలిచింది.

కక్ష సాధింపు కాదు :

అయితే గతంలోని సంఘటనలను మనసులో పెట్టుకుని జగన్ కక్షకట్టి చంద్రబాబును జైలుకు పంపిందని కొందరు అనుకుంటున్నారు. కానీ ఇది నిజానికి రాజకీయ కక్ష కాదు.పేదలకు న్యాయం చేయాలని జగన్ పడిన కష్టానికి ప్రతిఫలం. రాజకీయంగా ఇరికించాలని ప్రయత్నం చేయాలనుకుంటే జగన్ ఎప్పుడో చేసేవారే. అందుకు నాలుగేళ్లు వెయిట్ చేస్తారా . స్కిల్ డెవలప్‌మెంట్ స్పష్టమైన ఆధారాలను , పత్రాలనూ తమముందు సమర్పించిన తరుణంలో కోర్టు వాటిని సంపూర్ణంగా పరిశీలించి ఎక్కడ ఏయే స్థాయిల్లో అవినీతి జరిగిందో స్పష్టతకు వచ్చాక తీర్పు చెప్పింది. మొత్తంగా ఇది పెత్తందార్లపై పేదలు సాధించిన విజయం.

More News

Former IAS PV Ramesh:చంద్రబాబు అరెస్ట్.. మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు, సీఐడీపై ప్రశ్నల వర్షం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

Etela Rajender Wife Jamuna:కేసీఆర్‌పై బరిలోకి ఈటల జమున.. గజ్వేల్ టికెట్ కోసం దరఖాస్తు, బీజేపీ లెక్కలేంటో..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. అందరికంటే ముందే 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి కేసీఆర్ విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టేశారు.

KTR : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు రిమాండ్.. కేటీఆర్ పరోక్ష ట్వీట్, వైరల్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేయడం, ఆయనకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల

Chandrababu Naidu:చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691.. జైలులో ప్రత్యేక వసతులు, ఇంటి భోజనానికి కోర్ట్ అనుమతి

స్కిల్ డెవలప్‌మెంట్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఏసీబీ కోర్ట్.

Daggubati Purandeswari:చంద్రబాబుకు రిమాండ్ : టీడీపీ బంద్‌కు బీజేపీ మద్ధతంటూ ఫేక్ లెటర్ .. పురందేశ్వరి సీరియస్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.