Vishal:సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణల ఎఫెక్ట్  : రంగంలోకి సీబీఐ, నలుగురిపై కేసులు.. ముంబైలో సోదాలు

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

ఇటీవల ముంబైలోని సెన్సార్ బోర్డుపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాను నటించిన మార్క్ ఆంటోనీ హిందీ హక్కుల కోసం ముంబైలోని సీబీఎఫ్‌సీ (సెన్సార్ బోర్డు)కు రూ.6.5 లక్షలు లంచంగా ఇచ్చినట్లుగా విశాల్ ఓ వీడియో రిలీజ్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. విశాల్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన సభ్యులు, మరికొందరిపైనా విచారణ చేపట్టేందుకు సీబీఐ యోచిస్తోంది. మెర్లిన్ మేనకా, జీజా రాందాస్, రాజన్ ఎం అనే ముగ్గురు వ్యక్తులతో పాటు సీబీఎస్‌సీకి చెందిన ఓ అధికారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

డబ్బు చేతులు మారిందిలా :

మార్క్ ఆంటోనీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు సీబీఎఫ్‌సీ సీభ్యుల తరపన రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే పలు మంతనాల తర్వాత రూ.6.54 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బు చేతులు మారాక.. సెన్సార్ సర్టిఫికేట్ జారీ అయ్యిందని సీబీఐ వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని నడిపించినందుకు ఫీజు కింద మరో రూ.20 వేలను నిందితురాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చినట్లు సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసులు నమోదు చేసి ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డు స్పందన :

మరోవైపు.. ముంబైలోని సీబీఎఫ్‌సీ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందని విశాల్ చేసిన ఆరోపణలపై సీబీఎఫ్‌సీ స్పందించింది. ఆయన సినిమాకు లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని.. ప్రైవేట్ వ్యక్తులని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆన్‌లైన్‌లోనే సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.