Pawan Kalyan:యువగళం ముగింపు సభకు రాలేను: పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Saturday,December 16 2023]

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర డిసెంబర్ 20తో ముగియనుంది. దీంతో విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేయటం విశేషం. దాదాపు 5 లక్షలమంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తోంది.

మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో యువగళం ముగింపు సభను టీడీపీ భారీగా జరిపేందుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పొత్తు ధర్మంలో భాగంగా ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ తనకు ఆ రోజు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని.. అందుచేత సభకు రాలేనని జనసేనాని టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. అయితే టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని వెల్లడించారు. అలాగే టీడీపీ నిర్వహించే పెద్ద సభలకు హాజరుఅవుతానని పవన్ స్పష్టంచేశారు.

ఇప్పటికే పార్టీ కార్యక్రమాలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్య టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వారితో పాటు 6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పసుపు కండువా కప్పుకున్నారు.