ఉల్లిపాయ, ఫ్రిడ్జ్ బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతాయా?

  • IndiaGlitz, [Friday,May 28 2021]

కరోనా మహమ్మారి కారణంగా అల్లాడుతున్న జనంపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. క్రమక్రమంగా బ్లాక్ ఫంగస్ మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మరణాలతో పాటు అపోహలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ అలా వస్తుంది.. ఇలా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా జనం సైతం భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా బాగా వైరల్ అవుతున్న వాటిలో ఉల్లిపాయలు, ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయి. ఈ రెండింటి కారణంగా బ్లాక్ వస్తుందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి.. ’ఉల్లిపాయలు కొనేముందు జాగ్రత్త.. దాని మీద ఉండే నలుపు మచ్చలు, పొరల మధ్య ఉండే నల్లదనంతో బ్లాక ఫంగస్ వస్తుంది. దాన్ని మీరు కూరల్లో వాడడం వల్ల తొందరగా ఎఫెక్ట్ అవుతారు’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ అయ్యింది. జనాల్లో ఉల్లిపాయలు కొనాలంటేనే దడ పుట్టేలా చేసింది. అలాగే.. ‘రిఫ్రిజిరేటర్‌లో అప్పుడప్పుడూ వచ్చే నల్లటి ఫంగస్ వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ రెండింటిలోనూ నిజం లేదు. కానీ జనం మాత్రం భయపడిపోతున్నారు. ఉల్లిగడ్డల మీద, దాని పొరల మధ్యలో ఉండే నల్లటి ఫంగస్ మామూలుగా మట్టిలో ఉండే ఫంగస్ మాత్రమే.. వీటికి, బ్లాక్ ఫంగస్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు.

అలాగే రిఫ్రిజిరేటర్ లో పెరిగే ఫంగస్ బ్యాక్టీరియా, ఈస్ట్ వల్ల వస్తుంది. దీనివల్ల కొంత ఇబ్బందులు వస్తాయి కానీ బ్లాక్ ఫంగస్ మాత్రం రాదు. 'మైకోర్మెట్స్' అని పిలువబడే ఫంగల్ మౌల్డ్స్ ద్వారా వ్యాపించే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వాతావరణంలో ఉంటుంది. అపరిశుభ్ర వాతావరణంలో ఉండే వ్యక్తులకు, అధిక తేమతో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఉండేవారికి తొందరగా సోకుతుంది ఇది తినే ఆహారం, తాకే వస్తువుల కారణంగా రాదు. ఎయిమ్స్ డైరెక్టర్, ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ రణదీప్ గులేరియా బ్లాక్ ఫంగస్ అంటు వ్యాధి కాదని తెలిపారు. తీవ్రమైన మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు, ఎక్కువ కాలం స్టెరాయిడ్ థెరపీని తీసుకున్న వారు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడతారని రణదీప్ గులేరియా వెల్లడించారు.