BTech student:ప్రీతి మరణం మరవకముందే.. వేధింపులకు మరో విద్యార్ధిని బలి, మళ్లీ వరంగల్‌లోనే

  • IndiaGlitz, [Monday,February 27 2023]

వరంగల్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్ధిని డాక్టర్ ప్రీతి మరణం నుంచి తేరుకోకముందే.. అదే వరంగల్ జిల్లాలో మరో విద్యార్ధిని బలైంది. వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవిల కుమార్తె రక్షిత .. నర్సంపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతూ, అక్కడే హాస్టల్‌లో వుంటోంది. అయితే ఆమెకు తన వూరిలో పదో తరగతి చదివే రోజుల్లోనే పరిచయమైన రాహుల్ .. ప్రీతిని కొంతకాలం నుంచి వేధిస్తున్నాడు. ఆమె చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు.

యువకుడికి పోలీసుల కౌన్సెలింగ్:

అతని వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి.. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. అయినప్పటికీ రాహుల్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో శివరాత్రి పండక్కి ఇంటికి వెళ్లిన రక్షిత కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. కానీ కళాశాలకు చేరుకోలేదు. దీనిపై తల్లిదండ్రులు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల తర్వాత రక్షిత క్షేమంగా ఇంటికి చేరుకుంది.

తన కుమార్తె పరిస్ధితి చూసి భయాందోళనలకు గురైన ఆమె తల్లిదండ్రులు హాస్టల్‌లో వుంచకుండా వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలోనే రక్షిత ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో తండ్రి స్వగ్రామంలో లేకపోవడంతో తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ వేధింపుల వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రక్షిత మరణంతో ఆమె స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.