గుజరాత్ తీరంలో 11 పాక్ పడవల కలకలం.. బీఎస్ఎఫ్, వాయుసేన సెర్చ్ ఆపరేషన్

  • IndiaGlitz, [Friday,February 11 2022]

గుజరాత్‌లోని అరేబియా తీరంలో పాకిస్తాన్‌కు చెందిన 11 పడవలు భారత జలాల్లోకి ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. హరామీ నాలా వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం ఒక డ్రోన్‌ ద్వారా ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా.. పాకిస్థాన్‌‌కు చెందిన 11 పడవలను గుర్తించారు. దీంతో ఈ పడవల్లో పాక్‌ నుంచి భారత్‌లోకి ఎవరైనా ప్రవేశించారా.. అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆ ప్రాంతంలో మరిన్ని పడవలు దొరికే అవకాశం ఉందనే ఉద్దేశంతో బీఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాక్ జాతీయులు నక్కి ఉండే అవకాశం ఉంటారన్న ఉద్దేశంతో నిన్న వాయుసేనకు చెందిన మూడు కమాండో బృందాలు రంగంలోకి దిగాయి. చిత్తడి నేలలు, మడ అడవులు, సముద్రపు ఆటు-పోట్లు కారణంగా సెర్చ్‌ ఆపరేషన్‌‌కు అవరోధాలు ఎదురవుతున్నట్లు సైన్యం చెప్పింది.

1965 యుద్ధానికి ముందు ఈ ప్రదేశంలో ఒక సైనిక ఘర్షణ జరిగింది. అనంతరం ఇరు దేశాల మధ్య రాజీ కోసం ఒక ట్రైబ్యూనల్‌ను ఏర్పాటు చేయగా.. 1968లో అది తీర్పును వెలువరించింది. పాక్‌ తనదిగా చెప్పుకొంటున్న భూభాగంలో కేవలం 10శాతం మాత్రమే దానికి దక్కింది. భౌగోళికంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. అంతేకాదు.. ఈ ప్రదేశంలో అపారమైన మత్స్య సంపద ఉంది. ఆసియాలో చేపల వేట జరిగే అతిపెద్ద ప్రదేశాల్లో సర్‌ క్రీక్‌ కూడా ఒకటి. ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు భావిస్తున్నారు.