బ్రేకింగ్ : రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్

  • IndiaGlitz, [Wednesday,March 18 2020]

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపట్నుంచి ఏపీలోని అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు. ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్స్ అనే కాకుండా మొత్తం అన్నింటికీ రేపట్నుంచి సెలవులు. అంతేకాదు.. యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలు అన్నీ మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లు మూసివేయకుండా యథావిధిగా కొనసాగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు సైతం జారీ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

విద్యాసంస్థలేనా..!?
కేవలం విద్యాసంస్థలు మాత్రమే మూసేయాలని జగన్ నిర్ణయించారా..? లేకుంటే థియేటర్స్, షాపింగ్ మాల్స్ ఇలా అన్నీ మూసేయాలని నిర్ణయించారా..? లేకుంటే యథావిధిగా నడుస్తాయా..? అనేది పూర్తిగా తెలియరాలేదు. మరికాసేపట్లో ఈ మూసివేతపై క్లారిటీ రానుంది. కాగా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్నప్పటికీ వైఎస్ జగన్ మాత్రం యథావిధిగా కొనసాగిస్తూ వచ్చారు. దీంతో జగన్ సర్కార్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాసేపట్లో అధికారిక ప్రకటన
బుధవారం నాడు సీఎం జగన్.. కరోనా విషయమై ఉన్నతాధికారులు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ చర్చలో భాగంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ సమీక్ష అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేదా మంత్రి పేర్ని నాని మీడియా మీట్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే అన్నీ బంద్..
కాగా.. ఇప్పటికే యావత్ భారతదేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా థియేటర్స్ మొదలుకుని స్కూల్స్, మాల్స్ అన్నీ మూసివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.