తొలిసారి సంక్రాంతి బరిలో బోయపాటి ఫిల్మ్

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

తెలుగులో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన‌ దర్శకుల‌లో బోయపాటి శ్రీను ఒక‌రు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత 'తులసి', 'సింహా', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు', 'జయ జానకి నాయక’' లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్ష‌కుల‌ను అలరించారు ఈ యాక్షన్ చిత్రాల‌ స్పెషలిస్ట్.

అయితే.. ఈ సినిమాలలో సింహభాగం వేసవి సందర్భంగా విడుద‌లైనవే. ఇప్పుడు తొలిసారిగా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు బోయపాటి. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బోయపాటి ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది.

ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని..  తొలుత ఈ ఏడాది దసరాకి విడుద‌లయ్యేట్టు ప్లాన్ చేశారు. అయితే..  కొన్ని కారణాల వలన ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అయిన‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

గతంలో తొలిసారిగా దసరా పండుగను టార్గెట్ చేస్తూ 'తులసి' (2007) సినిమాని విడుదల చేసి విజయం సాధించారు బోయ‌పాటి. ఇప్పుడు తొలిసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి 2007 దసరా మ్యాజిక్‌ని 2019 సంక్రాంతి రిపీట్ చేస్తుందో?  లేదో? చూడాలి.