Poonam Pandey:బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూత..!

  • IndiaGlitz, [Friday,February 02 2024]

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మోడల్‌గా, హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె వ్యక్తిగత మేనేజర్.. పూనమ్ ఇన్‌స్టా అకౌంట్ నుంచే ఈ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇవాళ ఉదయం మాకు చాలా కష్టమైనది. మా ప్రియమైన పూనమ్‌ సర్వైకల్(గర్భాశయ) క్యాన్సర్‌తో మరణించారు. ఈ విషయాన్ని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాము. ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఖ: సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని, సహకరించాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.

ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలే కావడం గమనార్హం. పూనమ్ నిజంగానే కన్నుమూసిందా? ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా? ఇంతకీ పూనమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే విషయాలు సస్పెన్స్‌గా మారాయి. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన పూనమ్‌.. 2013లో ‘నషా’ మూవీతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. పలు హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లోనూ పాల్గొన్నారు. హిందీతో పాటు కన్నడ, తెలుగు, భోజపురి భాషల్లో నటించారు. తెలుగులో మాలిని అండ్‌ కో చిత్రంలో యాక్ట్ చేశారు. ఆమె నటించిన చివరి చిత్రం 'ద జర్నీ ఆఫ్‌ కర్మ'

కాగా ఇండియా ఆతిథ్యం ఇచ్చిన 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగా భారత్ ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకు వస్తానని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక్క వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. తన భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పోలీసులను కూడా ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె క్యాన్సర్‌తో మరణించారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేగింది.