BJP MP GVL:విశాఖ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Sunday,October 22 2023]

విశాఖ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరిసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. కోర్టు తీర్పు ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఈ లోపే సీఎం జగన్ విశాఖ వచ్చి కూర్చుంటారంటే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. గతంలో పాలించిన పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని ఆయన ఆరోపించారు. జీవీఎల్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలకు చెక్ పెట్టినట్టైంది.

సుప్రీంకోర్టులో రాజధాని తరలింపు అంశం..

మరోవైపు సీఎం జగన్ మాత్రం ఆరు నూరైనా విశాఖ నుంచే పరిపాలన చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు అవకాశం దొరికినప్పుడల్లా విశాఖలో కాపురంపై ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ లోపు విశాఖ నుంచే పాలన చేస్తానని ప్రకటించారు. అంతకుముందు దసరాకు సీఎం విశాఖ షిఫ్ట్ అవుతారని వైసీపీ నేతలు తెలిపారు. కానీ రాజధానిని అమరావతి నుంచి కదిలించకూడదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది.

భవనాల వివరాలు సేకరిస్తున్న త్రిసభ్య కమిటీ..

రాజధాని తరలింపు అంశం కోర్టులోనే ఉండగానే ప్రభుత్వం విశాఖలో కార్యాలయాల తనిఖీ కోసం త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు సేకరించే పనిలో బిజీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్‌ ఇప్పటికే జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రుషికొండపై మాత్రం 4 బ్లాకుల్లో మొత్తం 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనాల నిర్మాణం చకచకా జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసంతో పాటు క్యాంపు కార్యాలయం ఉండనున్నాయి.