తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను అధిష్టానం నియమించింది. బుధవారం సాయంత్రం అధికారికంగా కేంద్ర అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌ను నియమించడం జరిగింది. కాగా.. తక్షణం ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం బండి.. కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ, యువమోర్చాతో పాటు ఆర్ఎస్ఎస్‌తో మంచి సంబంధాలున్న బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి వరించింది. ఈ సందర్భంగా సంజయ్‌కు పలువురు ప్రముఖులు, రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

వాస్తవానికి గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం నుంచి పరిశీలకులు అనీల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను కూడా తీసుకుని.. బండి సంజయ్‌ పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే బండి ఆధ్వర్యంలో పార్టీ ఏ మాత్రం బలోపేతం అవుతుందో వేచి చూడాల్సిందే మరి.