Avinash Reddy:వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట

  • IndiaGlitz, [Friday,May 03 2024]

ఏపీ ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటీషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది, జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాష్ తరపును ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు దస్తగిరి పిటిషన్ కొట్టివేస్తూ.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కొనసాగుతుందని స్పష్టంచేసింది. దీంతో అవినాష్ కుటుంబానికి భారీ ఊరట లభించినట్లైంది.

ఇక ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ల కొట్టేసింది. కాగా 2019 ఎన్నికల సమయంలో సంచలనం రేపిన వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గతేడాది తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే వివేకా కుమార్తె కూడా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మరోవైపు కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల పోటీ చేస్తుంటే.. వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. వివేకా హత్య కేసు చూట్టే కడప జిల్లా రాజకీయాలు జరగుతున్నాయి.