మ‌రో కొరియ‌న్ రీమేక్‌పై క‌న్నేసిన అగ్ర నిర్మాత‌

  • IndiaGlitz, [Monday,January 13 2020]

వంద సినిమాల‌కు పైగా నిర్మించి భార‌త‌దేశంలోని అన్నీ భాష‌ల్లో సినిమాల‌ను నిర్మించిన నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌. నిర్మాణంలో 55 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకుంది. రామానాయుడు త‌న‌యుడు ప్ర‌స్తుం నిర్మాణ సంస్థ వ్య‌వ‌హారాల‌ను ద‌గ్గ‌రుండి పర్య‌వేక్షిస్తున్నాడు. సురేష్‌బాబు భారీ చిత్రాల‌ను నిర్మించాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా మీడియం బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నాడు. గ‌త ఏడాది కూడా ఈయ‌న నిర్మించిన ఓబేబీ చిత్రం, వెంకీ మామ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాల‌నే రాబట్టుకున్నాయి. ఇప్పుడు ఈయ‌న మ‌రో మీడియం బ‌డ్జెట్ సినిమాపై కన్నేశాడు. అది కూడా ఓ కొరియ‌న్ సినిమాకు రీమేక్‌గా.

కొరియ‌న్ విజ‌య‌వంత‌మైన 'మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. స్వామిరారా, ర‌ణ‌రంగం చిత్రాల ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో నివేథా థామ‌స్‌, రెజీనా క‌సండ్ర పోలీస్ ఆఫీస‌ర్స్ పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. వీరిద్ద‌రూ పోలీసులుగా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది. స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని, పూర్త‌యిన త‌ర్వాత అధికారిక స‌మాచారం వ‌స్తుంద‌ని టాక్‌. ఓ బేబీ కూడా కొరియ‌న్ రీమేక్. ఆ సినిమా సాధించిన స‌క్సెస్‌తో సురేశ్ బాబు న‌మ్మ‌కంగా మ‌రో కొరియ‌న్ రీమేక్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.