గాడ్ ఫాదర్‌ను కలిసిన భీమ్లా నాయక్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే ఫోటో

ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు అందరూ బిజీగా వున్న సంగతి తెలిసిందే. వీరి సినిమాలు రాబోయే రోజుల్లో థియేటర్లకు క్యూ కట్టనున్నాయి. ఇకపోతే..  చిరంజీవి హీరోగా మలయాళంలో హిట్టైన లూసిఫర్ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా మళయాళంలో సూపర్ హిట్ కొట్టిన ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమాను భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సినిమా సెట్‌ను  భీమ్లానాయక్ చిత్ర యూనిట్ సందర్శించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా సెట్‌కు వచ్చారు. అన్నయ్య మెగాస్టార్‌ను పవన్ కలవడంతో వారిద్దరిని బంధించేందుకు అక్కడి వారు కెమెరాలకు పనిచెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో చిరు ఖైదీ డ్రెస్ లో ఉండగా, పవన్ పోలీస్ యూనిఫాంలో కనిపించారు. అటు వీరిద్దరూ కలుసుకున్న వీడియోను రామ్ చరణ్ కూడా షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ తో పాటూ రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర కూడా చిరును కలిసిన వారిలో వున్నారు. మెగాస్టార్‌కు బాగా కలిసొచ్చిన ఖైదీ నెంబర్ 786 నెంబర్‌నే గాడ్ ఫాదర్లో కూడా ఉపయోగించడం విశేషం. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పనవ్ విషయానికి వస్తే.. భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇందులో పవన్‌, రానాలు కీలకపాత్రలు చేశారు. నీత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.