పిల్లలపైనా క్లినికల్ ట్రయల్స్.. కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

  • IndiaGlitz, [Thursday,May 13 2021]

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాను చిన్నారులకు కూడా వేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు తాజాగా డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. 2 ఏళ్ల నుంచి నుంచి 18 ఏళ్ల వారిపై టీకా క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. ఇటీవల భారత్ బయోటెక్.. 2 నుంచి 18 ఏళ్ల వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. దీనిపై మంగళవారం కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ చర్చలు జరిపింది. అనంతరం క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Also Read: వేణ్నీళ్ల స్నానంతో కరోనా రాదా?

ఈ క్లినికల్ ట్రయల్స్ ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్, నాగపూర్ మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా పలు చోట్ల జరగనున్నాయి. ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అయితే మూడో దశ ప్రయోగాలు నిర్వహించడానికి ముందే రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన భద్రతా డేటాతో పాటు డీఎస్ఎంబీ సిఫార్సులను సీడీఎస్‌సీవోకు సమర్పించాల్సి ఉంటుంది. 525 మందిపై భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఇప్పటి వరకూ దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి రెండు టీకాలను ఇస్తున్నప్పటికీ చిన్నారులకు మాత్రం కరోనా వ్యాక్సిన్ లేదు. కాగా.. అమెరికాలో చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్‌కు అనుమతి అభించింది.