నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

తెలంగాణలో లాక్‌డౌన్‌ పాక్షిక సడలింపుతో బస్సులు, మెట్రో రైళ్లతో పాటు బ్యాంకుల పని వేళల్లో సైతం మార్పులు సంభవించాయి. మారిన వేళల ప్రకారం.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ మేరకు బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండో విడత లాక్‌డౌన్ ఆదివారంతో ముగియడంతో.. ఆపై తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ కేబినేట్ ఆదివారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జూన్ 9 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ తెలిపింది. మారిన పనివేళలు నేటి నుంచి అమలులోకి రానుండగా.. జూన్ 9వ తేదీ వరకు ఇవి వర్తించనున్నాయి. ఇక లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఉన్న సడలింపు సమయాన్ని పెంచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సండలింపు ఉంటుందని.. దీంతోపాటు బయటకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లేందుకు 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.