Bandla Ganesh:కూకట్‌పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

  • IndiaGlitz, [Sunday,October 08 2023]

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. సామాజిక వర్గం వారిగా లెక్కలు వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ను కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఆ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉండటం, అందులోనూ ఆంధ్ర సెటిలర్లు ఉన్న నేపథ్యంలో గెలుపు సునాయాసం అవుతుందని వ్యూహం రచిస్తున్నారు. అందుకే అందరికి సుపరచితమైన బండ్ల గణేష్ అయితే విజయం ఈజీ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే కూకట్‌పల్లి నుంచి పోటీకి బండ్ల సిద్ధమయ్యారనే వార్తలు హల్‌చల్ చేశాయి.

ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ కోసం పనిచేస్తాను..

అయితే ఈ వార్తలపై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తాను అని చెప్పారు కానీ నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం.. అదికారంలోకి వస్తాం జై కాంగ్రెస్ అని ట్వీట్ చేశారు.

2018 ఎన్నికల సమయంలో ట్రోల్స్‌కు గురైన బండ్ల..

2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ అప్పుడు చేసిన హంగామా అంతాఇంత కాదు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే సెవనో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఆయన కామెంట్స్ మీద వచ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ సారి రాజకీయాల్లోకి రావాలని ఎంతోమంది కోరుతున్నా గత అనుభవాల దృష్ట్యా రావడం లేదు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల నిరసనకు బండ్ల మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.