త్రివిక్రమ్‌పై వ్యాఖ్యలు.. ఆ వాయిస్ నాది కాదు: ఆడియో టేప్‌ వివాదంపై బండ్ల గణేశ్  క్లారిటీ

నిర్మాత, సినీనటుడు బండ్ల గణేశ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ తనను రాకుండా చేస్తున్నాడని.. తాను వస్తే త్రివిక్రమ్ డామినేట్ అయిపోతాడని ఆయనకు భయమంటూ బండ్ల గణేశ్ ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేశాడట...అందుకే భీమ్లా నాయక్ వేడుకకు నేను రావడం త్రివిక్రమ్‌కి ఇష్టం లేదని ఆ ఆడియోలో వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో త్రివిక్రమ్‌ను వాడు, వీడు అంటూ కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఆడియో టేప్ వివాదంపై బండ్ల గణేష్ స్వయంగా స్పందించారు. వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపులో ఉన్న వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. ఎవరో తనను ఇరికించడానికి కుట్రపూరితంగా దీనిని క్రియేట్ చేశారని బండ్ల గణేశ్ ఆరోపించారు. అయితే ఇదే స్టేట్మెంట్ అధికారికంగా ఇవ్వడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ కాల్ మాట్లాడింది బండ్ల గణేశేనా లేక వేరెవరైనా? అనే విషయంలో క్లారిటీ రాలేదు.

పవన్‌ కళ్యాణ్‌కు పరమ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేశ్.. పవర్‌స్టార్ నటించిన మూవీ వేడుకలకు క్రమం తప్పకుండా పాల్గొంటారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ స్పీచ్‌లకు రెస్పాన్స్ అలాగే వుంటుంది. పవన్ అభిమానులు సంబరపడిపోయేలా ఆయన చర్యలు ఉంటాయి. మరి తాజా వివాదం నేపథ్యంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ హాజరవుతారో లేదో చూడాలి.