Bandla Ganesh:తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలైంది.. అందరి నోట కాంగ్రెస్ మాటే: బండ్ల గణేష్

  • IndiaGlitz, [Wednesday,November 08 2023]

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు రెడీ అయ్యారని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తెలిపారు. నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. షాద్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి, తన మిత్రుడు వీరపల్లి శంకర్ నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లానని.. జనాలు తండోపతండాలుగా వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని.. ఎక్కడ చూసినా కాంగ్రెస్ మాటే వినిపిస్తోందన్నారు. సోషల్ మీడియాని, నాయకులను మేనేజ్ చేయచ్చు కానీ ప్రజలను మేనేజ్ చేయలేరని వ్యాఖ్యానించారు.

సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసింది ఎవరు..? తెలంగాణ ఇచ్చింది ఎవరు..? దేశం కోసం రాజీవ్ గాంధీ శరీరం ముక్కలైతే.. రాహుల్ గాంధీ చిన్న వయసులో బాడీ ముక్కలు ఏరుకుని శ్మశానానికి వెళ్లారని బండ్ల భావోద్వేగానికి గురయ్యారు. ఎవరు పడితే వారు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని.. కానీ రాహుల్ ఏనాడూ హద్దు దాటి మాట్లాడలేదని తెలిపారు.

కొంతమంది ఎగిరెగిరి మాట్లాడుతున్నారని.. అహంకారం తలకెక్కిన వారందరికీ నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరగే తీర్పు ఇవ్వనున్నారని వివరించారు. తన శ్వాస.. తన ధ్యాస.. కాంగ్రెస్ అని.. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌కే ఓటు వేశా.. కాంగ్రెస్‌లోనే చస్తానన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ కార్యకర్తను తాను అని పేర్కొన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది ముఖ్యం కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తనకు ముఖ్యమని బండ్ల వెల్లడించారు.