పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన పచ్చడి.. బండ్ల గణేశ్‌ డ్రైవర్ అరెస్ట్..

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

ప్రస్తుత సమాజంలో యువత ఓపికగా ఉండటానికి ఇష్టపడటం లేదు. దీంతో క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు లేదా తీసేస్తున్నారు. దాంతో వారిని నమ్ముకన్న కుటుంబసభ్యులకు కన్నీళ్లు మిగిలిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. భోజనం చేసే సమయంలో చట్నీ వేసే విషయం మీద భార్యాభర్తల మొదలైన వివాదం పచ్చని కాపురాన్ని నాశనం చేసింది. భార్య బలవన్మరణం చేసుకోగా.. భర్త పోలీసులు అదుపులో ఉన్నాడు.

కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోపతండాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందనను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రమణ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. ఇద్దరు కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో పచ్చడి ఎక్కువ వేశావంటూ రమణ భార్య చందనతో ఘర్షణపడ్డాడు.

సోమవారం ఉదయం యథాప్రకారం అతడు విధులకు వెళ్లగా భార్య పలుమార్లు వీడియోకాల్స్ చేసింది. రమణ పనుల్లో పడి స్పందించకపోవడంతో నార్మల్ కాల్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావని.. తాను చనిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేసింది. దీంతో టెన్షన్ పడిన రమణ.. ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని భర్త రమణను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో భార్య తీసుకున్న కఠిన నిర్ణయం ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు నింపాయి.