Avinash Reddy Mother: జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా..? సౌభాగ్యమ్మకు అవినాశ్ రెడ్డి తల్లి కౌంటర్

  • IndiaGlitz, [Friday,April 26 2024]

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రోజు ఏదో ఒక అంశంతో ఈ కేసు వార్తల్లో నిలుస్తోంది. సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లేఖకు కౌంటర్‌గా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి బహిరంగ లేఖ రాశారు.

అమ్మా సౌభాగ్యమ్మ 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్న చూపు చూసినప్పుడు అండగా నిలిచి పెద్దదిక్కుగా ఉండవలసిన మీరు వ్యక్తిగత స్వార్థాలు చూసుకున్నారని విమర్శించారు. జగన్‌ను ఒంటరి వాడిగా చేసినప్పుడు ఆయన పడ్డ బాధ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అంతేకాకుండా 2011లో సునీత, ఆమె భర్తతో కలిసి విజయమ్మపై నీ భర్తను పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన గురించి ఒక్కసారి కూడా అర్థం కాలేదా అని మండిపడ్డారు.

వివేకానంద రెడ్డి జగన్‌ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట వాస్తవమని పేర్కొన్నారు. అదేవిధంగా మార్చి 14, 2019లో అవినాశ్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేకా ప్రచారం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పుడు స్వయంగా మీ కుమార్తె సునీతనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిందన్నారు. కానీ ఇవాళ దివంగత నేత వైఎస్ఆర్, సీఎం జగన్ శత్రువులతో చేతులు కలిపిన మీరు అదే ఎంపీ టికెట్ కోసం వివేకా హత్య కేసు జరిగిందని ఆరోపించడం.. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం తప్పు అనిపించడం లేదా అని నిలదీశారు.

ఎవరి కోసం, ఎవరిని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారని.. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతారో చెప్పాలన్నారు. మాటిమాటికి హంతకుడంటూ తీవ్రమైన పదజాలంతో అవినాశ్ రెడ్డిని కించపరచడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరే ఓ వ్యక్తిని హంతకుడిగా ఎలా నిర్ణయిస్తారని ధ్వజమెత్తారు. నీ కుమార్తె సునీతను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదని.. వారు మాట్లాడుతున్న మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణమని తెలిపారు.

సునీత నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్ధతు ఇచ్చేవారని.. కానీ వైఎస్ఆర్, జగన్ శత్రువుల చేతిలో కీలు బొమ్మలుగా మారి అన్యాయంగా సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే మద్ధతు ఎలా ఇస్తారన్నారు. ఇప్పటికైనా శత్రువుల చెంత నుంచి బయటకు వచ్చి నిజమైన న్యాయం కోసం పోరాటం చేయాలని సూచించారు. అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఎంత బాధ, ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. నిజం ఎంత లోతులో దాచిన దాగదని.. ఏదో ఒకరోజు తప్పకుండా బయట పడుతుందని స్పష్టంచేశారు.