లెగ్ పీస్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. స్పందించాల్సిందేనన్న అసదుద్దీన్..

మంత్రి కేటీఆర్‌కు రోజుకు ఎన్నో విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా వెళుతుంటాయి. అప్పుడప్పుడు అభిమానులు ఆయనకు పలు సూచనలు కూడా చేస్తుంటారు. గతంలో ఓ అభిమాని మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది షూ వేస్తే ఇంకా బాగుంటారు అన్న అని సలహా ఇచ్చాడు. దీనికి కేటీఆర్ కూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి సలహాలు, సూచనలు బాగానే వెళుతుంటాయి. తాజాగా ఓ విచిత్రమైన, ఫన్నీ ట్వీట్ కేటీఆర్‌కు వెళ్లింది. ఇక దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్లు చాలా ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాదు.. ఈ ట్వీట్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం రియాక్ట్ అవడం విశేషం.

ఇదీ చదవండి: కౌశల్ భార్యకు ఏమైంది.. ఆందోళన కలిగించేలా పోస్ట్ !

ఇంతకీ ఏం జరిగిందంటే.. రఘుపతి అనే యువకుడు ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్నాడు. అయితే ఆర్డర్ పెట్టే సమయంలో లెగ్‌ పీస్‌, ఎక్స్‌ట్రా మసాలాతో చికెన్ బిర్యానీ కావాలని పేర్కొన్నాడు. కానీ తనకు వచ్చిన బిర్యానీలో లెగ్ పీస్ లేదు. దీంతో జొమాటోతో పాటు కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ రఘుపతి ట్వీట్ చేశాడు. ‘‘లెగ్‌ పీస్‌, ఎక్స్‌ట్రా మసాలాతో చికెన్‌ బిర్యాని కావాలని ఆర్డర్‌ చేస్తే.. ఏదీ ఇవ్వలేదు. ప్రజలకు సేవ చేసే పద్ధతి ఇదేనా?’’ అని ట్వీట్‌లో ప్రశ్నించాడు. దీనిని చూసిన కేటీఆర్ సైతం చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ‘నన్నెందుకు ట్యాగ్‌ చేశావు బ్రదర్‌.. నానుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు..?’ అంటూ కేటీఆర్ బదులిచ్చారు.

మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ సైతం వీరికి మద్దతుగా కేటీఆర్‌ స్పందించాల్సిందే అంటూ.. స్మైలీ ఎమోజీ జతచేశారు. అసదుద్దీన్ సైతం స్పందించడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. ఇక దీనిపై కామెంట్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ యువకుడు ట్వీట్‌ను తొలగించాడు. అయినా కూడా మీమ్స్ మాత్రం ఆగట్లేదు. ‘నువ్వు-నేను’ సినిమాలో సునీల్ బెంచ్‌పై నిలబడి లెక్చరర్ వచ్చి అప్పాలజీ చెప్పే వరకూ నేను కూర్చోను’ అనే పోస్టర్ పెట్టి.. ‘నాకు బిర్యానీలో లెగ్ పీస్ రాలేదు. కేటీఆర్ వచ్చి సారీ చెప్పాల్సిందే’ అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘ఏ చెప్పుతో కొట్టాలిరా నిన్ను’ అనేది కేటీఆర్ ఇన్నర్ ఫీలింగ్ అని కామెంట్స్ మోత మోగిస్తున్నారు.