YS Jagan: చంద్రబాబు అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు వ్యూహమా..? బీజేపీని ఇరికించే ప్రయత్నమా..?

  • IndiaGlitz, [Tuesday,October 10 2023]

విజయవాడలో సోమవారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుపై తనకు ఎలాంటి రాజకీయ కక్ష లేదు.. తాను లండన్‌లో ఉన్న సమయంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా.. జైలులో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిడదవోలులో జరిగిన సభలో చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించిన జగన్.. పార్టీ సమావేశంలో మాత్రం చంద్రబాబు అరెస్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించడం వెనక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

వైసీపీకి జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకే..?

ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ పెద్ద సాహసం చేశారనే విశ్లేషకులు చెబుతున్నారు. అయన అరెస్టై నెల రోజులు దాటినా ఇంతవరకు ఒక్క ఆధారం చూపించకపోవడం, కోర్టుల్లో కూడా ఉపశమనం లభించకపోవడంతో ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతోందన్నారు. చంద్రబాబును కావాలనే రాజకీయ కక్షతో అరెస్ట్ చేయించారని జనాల్లోకి బలంగా వెళ్లి విపరీతమైన సానుభూతి వచ్చినట్నలు చెబుతున్నారు. వైసీపీ చేయించిన సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడైందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చంద్రబాబు అరెస్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. చట్టం తన పని తాను చేసుకుంటుందని వ్యాఖ్యానించిట్లు వివరిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టును బీజేపీ పెద్దలపైకి నెట్టివేసే ప్రయత్నం..?

మరోవైపు చంద్రబాబు అరెస్టు వ్యవహారం వెనక కేంద్ర పెద్దలు హస్తం కూడా ఉన్నట్లు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కేంద్రం మద్దతు లేకుండా చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని అరెస్ట్ చేసేతం ధైర్యం జగన్‌కు లేదని వాదిస్తున్నారు. దీంతో ప్రజల్లో వైసీపీకి జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని బీజేపీ పెద్దలపైకి నెట్టేసే వ్యూహానికి జగన్ తెరలేపారంటున్నారు. తనకు ఏం తెలియదని.. 2018 వరకు బీజేపీతో చంద్రబాబు కలిసే ఉన్నారని.. అప్పుడే ఈ స్కాం జరిగిందని చెప్పారు. అంటే బీజేపీ పెద్దలే చంద్రబాబును అరెస్ట్ చేయించారనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జగన్ తీరుతో అవాక్కయ్యారట. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు కమలం నేతలు చెబుతున్నారు.

ప్రజల్లో సానుభూతి పెరగడంతోనే జగన్ టోన్ మార్చారు..

ఇదిలా ఉంటే టీడీపీ నేతలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరిగిందని అందుకే జగన్ స్వరం మార్చారని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అధికారులు జగన్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసే అవకాశం లేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇందుకు ఉదాహరణగా అరెస్ట్ అయిన వెంటనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతల వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి పెరిగిందనే విషయం జగన్‌కు అర్థమై టోన్ మార్చారని వెల్లడిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ అంశం వచ్చే ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేయనుందనడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.