Gudivada Amarnath:చంద్రబాబుకు పంపే ఇంటి భోజనంపై అనుమానాలున్నాయి.: మంత్రి అమర్నాథ్

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

జైలులో ఉన్న చంద్రబాబుకు కుటుంబసభ్యులు పంపుతున్న భోజనంపై తమకు అనుమానం ఉందంటూ ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆహారం ముందు లోకేష్ తిన్నాకే చంద్రబాబుకు పెట్టాలని సూచించారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66కిలోలు ఉన్నారని.. ప్రస్తుతం ఆయన బరువు 67కిలోలుగా ఉందని స్పష్టం చేశారు. మరో కిలో బరువు పెరిగే బాధ్యత తాము తీసుకుంటామని చంద్రబాబు ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని అమర్‌నాథ్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌ ఓ పొలిటికల్ టూరిస్ట్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రాష్ట్రానికి వచ్చే పొలిటికల్ టూరిస్ట్ పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ ఎన్నిసార్లు గాజువాక వచ్చారు? రాజకీయాలకు ఉత్తరాంధ్ర కావాలి కానీ ఆయన మాత్రం తెలంగాణలో ఉంటారని విమర్శించారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రాలో ఇల్లు కట్టుకోకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు కట్టుకున్నారని పేర్కొన్నారు.

లోకల్-నాన్ లోకల్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం..

విశాఖ రాజధాని అంశంలో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. అమరావతిలో భూముల విలువ ఎక్కడ కోల్పోతామో అని విశాఖ రాజధాని ఆంశంపై విషం చిమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. విశాఖ రాజధాని గురించి గోల చేస్తున్న వీళ్లంతా నాన్ లోకల్ బ్యాచ్ అని విమర్శించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అందుకు అనుగుణంగా ఉన్న భవనాలు ఎంపికకు సంబంధించి ప్రభుత్వం అధికారుల కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇది లోకల్-నాన్ లోకల్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని మంత్రి వెల్లడించారు.