AP Govt School:విద్యారంగంలో జగన్‌ తెచ్చిన మార్పులు ఇవే : ఏపీ విద్యార్ధుల వివరణకు వరల్డ్ బ్యాంక్ బృందం ఫిదా

  • IndiaGlitz, [Wednesday,September 27 2023]

విద్యా రంగానికి ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధుల బృందం వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించింది. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు మన విద్యార్ధుల బృందం అక్కడికి వెళ్లింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల సమావేశంలో లీడ్ హెల్త్ స్పెషలిస్ట్ రిఫత్ హసన్, వరల్డ్ బ్యాంకు సీనియర్ అనలిస్ట్ ట్రేసీ విలిచౌస్కీ, ఏపీ సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, ఇద్దరు ఉన్నతాధికారులతోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగం అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు, నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ వల్ల అందుతున్న ప్రయోజనాలను ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమ తల్లిదండ్రులను చైతన్య వంతం చేశాయని మన విద్యార్ధులు పేర్కొన్నారు.

వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు, తమ ఆలోచనలను పంచుకోవడానికి ఉమ్మడి ఆన్‌లైన్ వేదిక ఏర్పాటు చేయాలని కోరారు.ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలతో విద్యామార్పిడి కార్యక్రమాలను ప్రారంభించాలని విద్యార్ధులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణం, సంస్కృతుల‌పై క్లబ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని దేశాల్లో యునైటెడ్ నేషన్స్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చి దానిపై రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించాలని విద్యార్ధులు విజ్ఞప్తి చేశారు. పిల్లలు చేసిన ప్రసంగానికి ఆశ్చర్యపోయిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.