AP Government: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. సర్కార్ పోస్టులకు వయోపరిమితి పెంపు

  • IndiaGlitz, [Wednesday,October 11 2023]

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయసు 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. అలాగే యూనిఫాం పోస్టులకు రెండు సంవత్సరాల వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు వర్తించనుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్(APPSC)తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో మాత్రమే ఈ పరిమితి వర్తించనుంది.

నోటిఫికేషన్లు ఆలస్యమైతే అభ్యర్థులు నష్టపోకుండా చర్యలు..

నాన్-యూనిఫామ్ పోస్టుల వయోపరిమితిని గతేడాది 32 నుంచి 42 ఏళ్లకు పెంచగా.. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసులు అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలకు సంబంధించిన నియామకానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే వయసు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి త్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అయితే గరిష్ట వయసు దాటిపోయిన అభ్యర్థులకు నష్టం జరగకుండా వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తోంది.

కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..

ఇక ఇటీవల కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్/ బీసీలకు రూ.700.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500గా ఉంది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఈనెల 21 చివరి తేది. నవంబర్ నెలలో రాత పరీక్షను నిర్వహించనున్నారు.