Anganwadi: అంగన్‌వాడీలకు ప్రభుత్వం డెడ్‌లైన్‌.. కొత్త వారిని తీసుకుంటామని హెచ్చరిక..

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

అంగన్‌వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. తక్షణమే జీతాలు పెంచాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేయగా.. ఏప్రిల్ లేదా మేలో జీతాలు పెంచుతామని సర్కార్ హామీ ఇచ్చింది. అయితే దీనిపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్‌వాడీలు కోరగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో యథావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

దీనిపై సజ్జల మాట్లాడుతూ వారి సమస్య పరిష్కరించే ఉద్దేశం కాబట్టే ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపామన్నారు. అయితే వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల్లో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని గుర్తుచేశారు. వారు డిమాండ్ చేసిన వాటిలో ఒక్క జీతాల అంశమే పెండింగ్‌లో ఉందని.. అది కూడా వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పామన్నారు. అంగన్‌వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్‌ చేస్తున్నామని.. టీచర్లకు రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్లు రూ.1.50లక్షలకు.. హెల్పర్లకు రూ.50వేలు పెంచామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. కానీ ఈ సమ్మె వెనుక పక్కా రాజకీయ ఎజెండా ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో పడి నష్టపోవద్దని సూచించారు.

అలాగే అంగన్‌వాడీలపై పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఆయన పేర్కొన్నారు. గర్భిణీలు, పసి బిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారిపై ఎస్మా ప్రయోగించాలమని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం మాట విని వెంటనే అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ అవసరాల కోసం కొత్తవారిని నియమించుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాల దృష్ట్యా తప్పదని వెల్లడించారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం దాదాపు నెలన్నర రోజుల నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. పలు విడతలుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు వారిపై ఎస్మా చట్టం ప్రయోగిస్తోంది. మరి ఈ సమస్య ఎటు వైపునకు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి.