ఏపీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన మామ, వైఎస్ భారతిరెడ్డి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని పులివెందులకు తరలించారు. గంగిరెడ్డి స్వగ్రామం కడప జిల్లా వేముల మండలం గొల్లలగూడురు. పులివెందులలో గంగిరెడ్డికి వైద్యుడిగా మంచి గుర్తింపు ఉంది.

2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. కాగా.. పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఇవాళ మధ్యాహ్నం గంగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు జగన్ హాజరు కానున్నారు. గంగిరెడ్డి మృతితో పులివెందులలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా గంగిరెడ్డి మృతి పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.