CM Jagan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు

  • IndiaGlitz, [Friday,May 10 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు, షర్మిల, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

వైఎస్సార్ మరణం తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. ఇప్పుడు ఆయన సమాధి వద్దకు వెళతారంట! ఆయన చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారట! నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా? కాంగ్రెస్ కు ఓటేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే టీడీపీని గెలిపించడం కాదా?

వైఎస్సార్ వారసులంటూ వస్తున్న వారి కుట్రలను గమనిస్తున్నాం. వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు? మహానేత వైఎస్ఆర్ పేరు చార్జిషీట్ లో పెట్టింది ఎవరు? పైగా ఆయన పేరును మేమే చార్జిషీట్ లో పెట్టించామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన మీరా ఆయన వారసులు? నాకంటే చిన్నవాడు అవినాశ్... చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు తదితరులు కుట్రలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కడపలో రాజకీయ శూన్యతను సృష్టించి, ఆ శూన్యంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. వీళ్లసలు మనుషులేనా? అవినాశ్ ఎలాంటివాడో మీకందరికీ తెలుసు, అవినాశ్ ఎలాంటివాడో నాకు తెలుసు. అవినాశ్ కు బ్రహ్మాండమైన మెజారిటీ అందించి గెలిపించాలని కోరుతున్నా.

రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించినట్టే అవుతుంది. చంద్రబాబును గెలిపించేందుకే ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు, రాత్రి కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తారు అంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.