Chandrababu Naidu:చంద్రబాబుకు మరో షాక్.. ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో పీటీ వారెంట్, అసలు ముద్ధాయి ఆయనేనన్న సీఐడీ

  • IndiaGlitz, [Tuesday,September 19 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన కొన్నిరోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే వుంటున్నారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదు. ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చి పెట్టుకుంటున్నా చంద్రబాబుకు బెయిల్ మాత్రం రావడం లేదు.

2019లోనే ఏపీ ఫైబర్‌నెట్‌ కేసుపై సీఐడీ దర్యాప్తు :

అయితే చంద్రబాబుపై మంగళవారం ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ ఆరోపిస్తూ.. పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ స్కాంలో రూ.115 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలగా.. 2019లోనే 19 మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. వీరిలో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావులను చేర్చింది. వేమూరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఈ దశలో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రమేయంపై సీఐడీ దర్యాప్తు చేసింది.

బ్లాక్‌లిస్ట్‌లో వున్న కంపెనీకి టెండర్లు :

నిబంధలనకు విరుద్ధంగా టెర్రా సాఫ్ట్ అనే కంపెనీకి టెండర్లు ఇవ్వడంపై విచారణ చేపట్టింది. టెండర్ గడువు ముగిసినా దానిని వారం రోజులు పొడిగించినట్లుగా గుర్తించింది. అంతేకాదు.. ఈ టెర్రాసాఫ్ట్ కంపెనీ బ్లాక్ లిస్టు‌లె వుంది. అయినప్పటికీ దీనికి టెండర్ దక్కేలా వేమూరి కీలకపాత్ర పోషించారు. ఫైబర్ నెట్ ఫేజ్ 1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. ఇందులో రూ.115 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. చంద్రబాబు ఆదేశాల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహారం నడిచిందని సీఐడీ తేల్చింది. రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసిన టెర్రా సాఫ్ట్ దానిని ఫైబర్ నెట్‌కు సప్లయ్ చేసినట్లుగా గుర్తించింది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.