Amit Shah: ఏపీలో కూటమిదే అధికారం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

  • IndiaGlitz, [Monday,May 27 2024]

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని కొంతమంది చెప్తుంటే.. ఎన్డీయే కూటమిదే అధికారమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే ఏకంగా సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాలకు విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది.

ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అమిత్ షా తన అంచనాలను వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈసారి ఒడిశాలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని అలాగే ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్లా పోటీచేసింది. అయితే 25 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 17 ఎంపీ సీట్లు రావచ్చని షా అంచనా వేశారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాల్లో బీజేపీ 24 నుంచి 30 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ సైతం జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమికి 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని యోగేంద్ర వ్యాఖ్యానించగా.. తాజాగా అమిత్ షా సైతం 17 చోట్ల గెలుస్తామని చెప్పడంతో కూటమి నేతల్లో జోష్ నెలకొంది. మరి అమిత్ షా అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయనేదీ జూన్ 4వ తేదీన తేలనుంది.